
- ఫీల్డ్ వెరిఫికేషన్ వివరాలు తెలుసుకున్న కలెక్టర్
వర్ని, వెలుగు: వ్యవసాయ యోగ్యంలో లేని భూములను పక్కగా గుర్తించాలని, క్రాస్బుకింగ్ భువన్ యాప్ల సహాయంతో వెరిఫికేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ చందూరు,రుద్రూర్ మండలాల్లో సందర్శించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతుభరోసా,ఇందిరమ్మ ఇళ్ళు,ఆహార భద్రత (రేషన్కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి రూపొందించిన వివరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. చందూరు, రుద్రూర్, అక్బర్నగర్ గ్రామాల్లో స్థానిక అధికారులతో భేటీ అయి ఆహార భద్రత కార్డులు, రైతుభరోసా పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ ద్వారా వారి పేర్లు ఎక్కడైనా రేషన్ కార్డులో ఉన్నాయా లేవో నిర్థారించుకోవాలని అధికారులకు సూచించారు. అక్బర్నగర్ శివారులోని భూములతో పాటు రుద్రూర్ బస్టాండ్ వెనుక ప్రాంతంలో 897 నుంచి 957 వరకు సర్వే నెంబర్ లో గల భూములకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి పంటలు సాగుచేయకుండా వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగిస్తుఉండడాన్ని లే అవుట్ చేసి ప్లాట్లు గా మార్చడాన్ని కలెక్టర్ గమనించారు. వీటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ వికాస్రాజ్ మహతో, చందూరు ఎంపీడీఓ నీలావతి,తహసీల్దార్ శాంత,రుద్రూర్ తహసీల్దార్ బర్మావత్ తారాభాయి,తదితరులు ఉన్నారు.